ఒకనాడు కృష్ణుడు తోటిబాలురతో వనభోజనము చేయుటకుగాను ఆహారపదార్థములను ఉట్లలోపెట్టుకొని తినుటకు కూర్చుండగా, తన అన్నను చంపిన కోపముతో బకాసురునితమ్ముడు అఘాసురుడు కృష్ణుని చంపుటకు పెద్ద కొండచిలువ రూపమునవచ్చి గుహవలె నోరు తెరచియుండెను. ఈ
అద్భుతదృశ్యమును చూచి గోపబాలురు గుహవలె కనపడుచున్న దాని నోటిలోనికి పోయిరి. కృష్ణుడు ఇంకనూ ప్రవేశించనందున నోరు అట్లేతెరచి యుంచెను. లోనికి పోయిన గోపబాలకులు విషజ్వాలలకు నిష్కారణముగా చనిపోవుదురని తలంపుతో కృష్ణుడుగూడ దానినోటిలోనికిపోయి, దాని గొంతుకకు అడ్డముగానిలచి శరీరమును అద్భుతముగా పెంచినంత, దానికి ఊపిరి ఆడక చచ్చటకు సిధ్ధముకాగా, కృష్ణుడు తన కృపావీక్షిణమున లోన నిర్జీవులుగా పడియున్న గోపబాలకులను బ్రతికించి అందరితోనూ బయటకువచ్చెను. అంత అఘాసురుని ప్రాణములు పోయి అతనిలోనితేజస్సు కృష్ణునిలో ప్రవేసించెను. అంత పుష్పవర్షము కురిసెను. కృష్ణుని ఐదవసంత్సరమున జరిగిన ఈ అఘాసుర వృత్తాంతము గోపాలు రందరునూ తమ గోకులములోనివారికి ఆరవ సంవత్సరమున చెప్పిరి. ఈ సంవత్సరకాలములో ఏమి జరిగెనన : కృష్ణుడు తోటిగోపబాలకులతో ఒక తటాకము వద్ద కూర్చుండి చల్దిభోజనములు ఆరగించుచుండ ఆవుదూడలు అదృశ్యమాయెను. కృష్ణుడు వాటిని వెదకుటకు పోయి ఎచ్చటను కానరాక తిరిగివచ్చి చూడ గోపబాలురుగూడ అదృశ్యమైరి. అంత కృష్ణుడు దివ్యదృష్టితో ఇది బ్రహ్మదేవుడు చేసిన మోసమని గ్రహించి తానే గోపబాలురుగాను, గోవత్సములుగానూ రూపొందెను. అసలు విషయ మేమన : బ్రహ్మదేవుడు కృష్ణునియొక్క అఘాసురసంహారాది అద్భుత సాహసకార్యములనుచూచి, కృష్ణుని మహిమను ఇంకనూ పరీక్షింపదలచి గోపబాలురను, గోవత్సములనూ ఒక కొండ గుహలో దాచెను. ఇది గ్రహించిన కృష్ణుడు, తన బాధ్యతను గుర్తించి వారివారి రూపములను తానేదాల్చి వ్రజమునకు వెడలెను. ఇండ్లకు తిరిగి వచ్చిన గోపబాలురము తమ తల్లి తండ్రులు, గోవత్సములను గోవులు తమ స్వకీయసంతానముగానే గ్రహించిరి. కాని ఇదంతయూ కృష్ణుని మాయారూపములని ఎంతమాత్రము అనుమానముకలుగలేదు. కృష్ణుని మాయ తెలసుకొనుట సాధ్యముకాదుగదా! ఇట్లు ఒక సంవత్సరము ప్రతిదినము కృష్ణుడు గోపాలురతోడను గోవత్సములతోడను వనమునకు వచ్చిపోవుటను జరిగెను. ఈ సంవత్సరములో గోవులకు లేగదూడలుకలిగిననూ, వీటియందుకంటె ఆ తరిపిదూడలయందే గోవులకు వాత్సల్యము అధికముగా కనిపించుచుండెను ఆ తరిపిదూడలన్నియూ కృష్ణుభగవానుని స్వరూపములేగదా! కృష్ణుడనగా అందరకూ ఆత్మస్వరూపమే గదా! ప్రతిఒక్కరికి తన ఆత్మయందే యాదార్థమైన ప్రేమ వుండును గనుక, ఈ తరిపిదూడలయందు తల్లులకు అట్టి ప్రేమ వ్యక్తమయ్యెను. మామూలుపరిస్థితికి విరుద్ధమగు ఈ విచిత్రమును చూచిన బలరాముడు తన జ్ఞాన దృష్టితో ఈ తరిపిదూడలన్నియూ కృష్ణునిరూపముగా తెలిసికొని, కృష్ణుని అడిగి యదార్థము తెలిసికొనెను.
ఇంట్లుడ బ్రహ్మదేవుడు తాను దాచిన బాలురు, దూడలు, గుహలోనే ఉండగా, వేరేబాలురు, దూడలు ఈ సంవత్సరకాలము ఎట్లు యథాపూర్వముగా గడిపిరి అని అశ్చర్యపడి ఇదంతయూ కృష్ణుని మాయగా గ్రహించి, తనకు గర్వభంగముకాగా, ఆరుసంవత్సరముల వయస్సుగల కృష్ణచంద్రునికి తన నాలుగు శిరస్సులతో సాష్టాంగదండప్రణామములాచరించి, తానుగావించిన అపచారమునకు క్షమార్పన కోరెను. తల్లి గర్భములోనున్న పిండము అటూ ఇటూ తిరుగుచూ తన్నిననూ తల్లి ఎట్లుసహించునో, కృష్ణుని గర్భమునుండి ఆవిర్భవించిన తననుగూడ అదేవిధముగ క్షమించమని వేడుకొని, కృష్ణుని సాక్షాత్తు అద్వైతపర బ్రహ్మయేయని స్తుతించి అట్టికృష్ణునితో చెలిమిచేయు భాగ్యము కలిగిన గోకులవాసుల యొక్కయూ గోవుల యొక్కయూ భాగ్యమే భాగ్యమనియూ, ఈ గోపాలుర పాద రేణువులు తలదాల్చగాల జన్మ ప్రసాదించమని కృష్ణుని కోరుచూ స్తుతించెను.
అంత బ్రహ్మ తానుదాచిన గోపబాలురనూ గోవత్సములను విడిచిపెట్టగా, కృష్ణరూపమున వున్నవన్నియూ అదృశ్యమై, నిజరూపమున ఉన్న ఆగోపబాలురును, వత్సములును ఈ సంవత్సరకాలములో ఏమిజరిగినదీ తెలియనిస్థితిలో, ఆసైకత ప్రదేశమునకు చేరి వారు తెచ్చుకొనిన చల్దులు ఆరగించి నిజగృహములకు జేరి ఆఘాసురుని కృష్ణుడు చంపిన అలనాటి వృత్తాంతమును చెప్పుకొనిరి.